యేసును గూర్చిన పరీక్ష

యూసుఫ్ ఎస్టేస్  అనే ఒక ఇస్లాం మత ప్రచారకుడు తన వెబ్సైటులో "యేసును గూర్చిన పరీక్ష" (జీసస్ టెస్ట్) అనే శీర్షికను వ్రాశాడు. ఆ శీర్షికకు ఎంతో మంది ముస్లిముల ప్రతిస్పందన కూడా లభించింది. ఐతే అతడు ఇచ్చిన ఆ పరీక్షలో ఉన్న తార్కిక లోపాలు మరియు సందర్భోచితము కాని వ్యాఖ్యలను మీ ముందు ఉంచాలన్నది ఈ వ్యాసము యొక్క మూల ఉద్దేశ్యము. యూసుఫ్ తన శీర్షికలో బైబిల్ నుండి కొన్ని వాక్యములను వాటి సందర్భమునకు దూరముగా ప్రస్తావించి, ఇస్లాం మత ప్రచారమునకు అనుగుణంగా జవాబులు వచ్చే ప్రశ్నలను కొన్నింటిని అడిగి, తద్వారా ఏదో సాధించేశానని భావించినట్టు కనిపిస్తోంది. ఆ శీర్షికను ఇక్కడ చదువగలరు. ఎస్టేస్ అనబడే ఈ ఇస్లాం మత ప్రచారకుడు అమెరికా దేశములో ఒక క్రైస్తవునిగా జన్మించానంటాడు. తన జీవన ప్రయాణంలో ఒక ముస్లింతో తటస్థపడి ఇస్లాం మతమునకు ఆకర్షింపబడి ముస్లింగా మారానంటాడు. తాను ఇస్లాం మతాన్ని స్వీకరించే కథను తన వెబ్సైటులో తానే వివరించడం మనం గమనించవచ్చు. ప్రశ్నోత్తరాలను ఒక పరంపరగా సాగిస్తూ అతడు చెప్పుకున్న ఈ పరీక్షలో తాను అమర్చిన ప్రశ్నలను ఒకదాని తరువాత ఒకటిగా మనం ఈ కొద్ది వ్యాసంలో చూద్దాం.

ప్రశ్నలను చూచుటకు ముందు యూసుఫ్ ఎస్టేస్, “ఉనికిలో లేకుండా గతించిపోయిన మరియు ఆఖరి నిబంధనల నుండి ప్రవక్తల సందేశము” అనే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఇక్కడ ఉనికిలో లేకుండా గతించిపోయిన నిబంధన అనే పదానికి ఇంగ్లీష్‍లో "లాస్ట్" (Lost) అనే పదం వాడబడటం జరిగింది. అంటే బైబిల్‍ను ఉనికిలో లేకుండా గతించిపోయిన నిబంధనగా యూసుఫ్ ఎస్టేస్ అభివర్ణించాడు. అలాగే ఖుర్‍ఆన్‍ను ఆఖరి నిబంధనగా (Last) అభివర్ణించాడు. యతిప్రాసలు కలవటానికై ఆ రెండు పదములను అలా వాడాడో లేక నిజంగానే ఆయన బైబిల్ గ్రంథము ఉనికిలో లేకుండా గతించిపోయిన గ్రంథం అని నమ్ముతున్నాడో తెలిసికొనాలంటే ఆయననే అడిగి చూడాలి. ఒకవేళ ఆయన నిజంగా బైబిల్ గ్రంథం ఉనికిలో లేకుండా గతించిపోయిన గ్రంథం అని అనుకుంటే, అలాంటి ఉనికిలో లేకుండా గతించిపోయిన  గ్రంథం నుండి వాక్య భాగాలను ఎంచుకుని తన దృక్పథాన్ని ద్రువీకరించుకోవాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అంటే బైబిల్ ఉనికిలో లేకుండా గతించిపోయిన గ్రంథమైతే అసలైన  ఆ నిజబైబిల్‍లో నుండి తీసిన వాక్యములు ఆయనకు ఎలా, ఎక్కడనుండి వచ్చాయి? ఒకవేళ ఆయన బైబిల్ అంతా ఉనికిలో లేకుండా గతించిపోలేదు కాని కొంతే గతించిపోయింది అని అంటే, యే భాగం, ఎక్కడ ఎవరిచేత ఉనికిలో లేకుండా గతించిపోయిందో చెప్పాలి. ఈ ప్రశ్నలన్నీ గత 16 శతాబ్దాలుగా క్రైస్తవులు ముస్లిములను అడిగుతూనే ఉన్నాగాని ఏ ముస్లిం వద్ద కూడా ఈ ఉత్తుత్తి నిరాధార ఆరోపణను ఋజువు చేసే జవాబు లేదు. ఐతే ఏదో ఉద్ధరించామంటూ బైబిల్‍లోని కొన్ని వాక్య భాగాలను బట్టీ పట్టి వాల్లెవేస్తూ క్రైస్తవులను తప్పు దోవ పట్టించటం ఈ ముస్లిం ప్రచారకులకు బాగా అలవాటే. ఒకవేళ యూసుఫ్ ఎస్టేస్ బైబిల్ ఉనికిలో లేకుండా గతించిపోయింది అని అంటే, ఇస్లాం ప్రవక్త అయిన ముహమ్మద్ మరియు ఆయనకు దేవుని నుండి వెలువడినది అని చెప్పబడే ఖుర్‍ఆన్ గ్రంథం కూడా తప్పే. ఎందుకంటే ఖుర్‍ఆన్‍లోని సూరహ్ ఆలి ఇమ్రాన్ 3:3 మరియు సూరహ్ 46:30లలో ఉన్న "బైన యదైహి" అనే పదానికి  సరైన అనువాదం “వారి చేతుల నడుమ” అని అర్థం. అనగా ముహమ్మద్ సమయంలో వారి చేతుల నడుమ ఉండి వారిచేత వాడబడిన బైబిల్ ప్రతులు అని అర్థం. అంటే ముహమ్మద్ తన కాలంలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని దేవుని నుండి వెలువడిన గ్రంథంగా గుర్తించెనని అర్థం. కాని యూసుఫ్ ఎస్టేస్‍వంటి ప్రచారకులకు మాత్రం ఆ గ్రంథం ఉనికిలో లేకుండా గతించిపోయిన గ్రంథం అన్నమాట. ఆ మాటకు వస్తే ఖుర్‍ఆన్ రూపకల్పన గురించిన చరిత్ర తెలిసిన వారెవ్వరు కూడా దానిని బైబిల్‍లాంటి మహా గ్రంథంతో పోల్చరు. ముహమ్మద్‍చే మంచి అనుచరులుగా గుర్తించబడిన ముస్లిములైన వారు వ్రాసిన చరిత్ర ప్రకారముగనే, చాలా భాగం ఖుర్‍ఆన్ నశించి పోయిందని నిఖ్ఖచ్చిగా తెలిసికొనగలము.

ఇక అసలు కథ అయిన అతని ప్రశ్నల వద్దకు వద్దాం. మొదటి ఆరు ప్రశ్నలు ఒకే కోవకు చెందినవి కనుక వాటినన్నింటిని ఒకేసారి గమినించి చూద్దాం.
   

    1. యేసు, నిత్యజీవమును పొందుటకొరకు దేవుని ఆజ్ఞలను పాటించాలి అని బోధించెనా లేదా?

    2. యేసు దేవుని మాత్రమే ఆరాధించమని చెప్పలేదా?

    3. యేసు మనకు దేవుని ఆజ్ఞలను అన్నిటిని ఆచరించమని చెప్పలేదా?

    4. విగ్రహారాధన చేయరాదు అని యేసు చెప్పలేదా?

    5. తనను ఆరాధించకూడదు అని యేసు చెప్పలేదా?

    6. యేసు నేను దేవుడిని కాదు అని బహిరంగంగా చెప్పలేదా?

లూకా 10:25-28 - “ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి - బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకాయన - ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీవేమి చదువుచున్నావని అతని అడుగగా, అతడు నీ దేవుడైన ప్రభువును, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని  చెప్పెను.”

ఈ వచనము ఆధారముగా (వేరెవరినీ కాక) కేవలము దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించవలెను అని చెబుతూ ఖురాన్‍లోని సూరహ్ 51:56, సూరహ్ 4:48, సూరహ్ 112లను చూపెడుతున్నాడు.  నిజానికి ఇక్కడ ఆరాధన గురించి చెప్పటం లేదు కాని ప్రేమ గురించి చెప్పడం జరిగింది. ఐతే మన విషయానికి వస్తే ఆజ్ఞలను పాటించమని యేసు బోధించారు అలాగే ఖురాన్ కూడా అల్లాహ్‍ను మాత్రమే ఆరాధించు అని చెబుతోంది అన్న వాదనను ఇక్కడ యూసుఫ్ వినిపిస్తున్నాడు. కానీ జాగ్రత్తగా చూస్తే మనకు తెలిసివచ్చేది ఏమిటంటే బైబిల్‍లో చాలామార్లు యేసును మనుష్యులు ఆరాధించినప్పుడు, (ఆయన ఒక బోధకుడు కాబట్టి) వారిని అలా చేయవద్దు అని వారించక వారి ఆరాధనలను స్వీకరించినట్టుగా మనం చూడవచ్చు. ఉదాహరణకు తోమా “నా దేవా నా ప్రభువా” అని ఆయనను సంబోధించినప్పుడు ఆయన తోమాను వారించలేదు (యోహాను 20:28). తన ముందే తన శిష్యుడు భక్తితో “దేవా” అని యేసును సంబోధించినప్పుడు ఆయనతడిని వారించక అతడి సాక్ష్యమును స్వీకరించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మనుష్యులు (పాపము కారణంగా) సంపూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించలేని అవస్థలో ఉన్నారు కనుక దేవుడే ముందు మనలను ప్రేమించి మనకు ధర్మశాస్త్రము ద్వారా కాక పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పట్ల ప్రేమను పురికొల్పెను అని బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తోంది. కనుక కేవలం ధర్మశాస్త్రమును అనుసరించమని మాత్రమే యేసు బోధించలేదు కాని, ఆయనే ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చి తనయందు విశ్వాసముంచుట ద్వారా మనలను రక్షించెను. రోమా 3:28 - "కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు...."  అంటే ఇప్పుడు క్రీస్తును విశ్వసించి ఆయన దేవుని కుమారుడైన రక్షకుడు అని విశ్వసిస్తేనే మనము పరలోకమునకు అర్హులము అవుతాము అని అర్థం. (రోమా 10:9).

యూసుఫ్ ఎస్టేస్ తన అయిదవ ప్రశ్నలో యేసు తన చుట్టూ ఉన్నవారితో ఆయనను ఆరాధించవద్దు అని చెప్పినట్టు వ్రాయటం గమనించండి. ఇక్కడే ఆయన గారు ఘోరంగా పప్పులో కాలేశారు. ఈ ప్రశ్నకు ఆయన జతపరిచిన వాక్య భాగమయిన మత్తయి 15:9 చూస్తే ఆయన బైబిల్ను ఎంత అనాలోచితంగా, సందర్భమునకు వెలుపల చదువుతాడో అర్థం అవుతుంది. ఈ వాక్యభాగంలో యేసు శాస్త్రులను పరిసయ్యులను తమ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నారని, వారిని దండించే సమయంలో యెషయా ప్రవక్త చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తున్నారు అని గ్రహించాలి. అంతే కాని అక్కడ యేసు నన్ను ఆరాధించవద్దు అని ఏ కోశానా చెప్పలేదు. యేసు పునరుత్థానులైన పిదప తన శిష్యులు గలిలయ కొండ దగ్గర ఆయనను మ్రొక్కిరి అని మత్తయి 28 :17లో వ్రాయబడి ఉండటం యూసుఫ్ గారికి బహుశా కనిపించలేదు కాబోలు. ఇదే మత్తయిలో యేసు యుగసమాప్తి వరకు శిష్యులతో కూడా ఉంటాను అని చెప్పటం గమనిస్తే ఆయన కేవలం ఒక ప్రవక్తో లేక సాధారణ మానవుడో కాక దైవాంశ సంభూతుడని యిట్టే తెలిసిపోతుంది.

ఇక ఆరవ ప్రశ్న. యేసు తన దైవత్వమును బహిరంగంగా విస్మరించారు అని చెప్పేందుకు, యూసుఫ్ వాడిన వాక్య భాగం యోహాను 14:28. ఈ వాక్యభాగము ముస్లిములకు చాలా ఇష్టమైనది కాబోలు. ప్రతివాడు ఈ వాక్య భాగాన్ని పట్టుకొని వ్రేలాడుతూ ఉంటాడు. ఈ వాక్యం వల్లించి ఏదో సాధించాం అనుకుంటారు. లోతుగా దీనిని చదివిచూస్తే ఆ గాలి కాస్తా తుస్సుమని పోతుంది. ఇక్కడ "తండ్రి నాకంటే గొప్పవాడు" అనే వాక్యంలో “గొప్పవాడు” అన్న మాటకు మూల భాషైన గ్రీకులో "మేఇజోన్" అనే పదం వాడబడి ఉంది. దీనిని ఎక్కువగా - అధికారము, స్థాయి, ప్రతిపత్తి మరియు పదవి గురించిన సందర్భములలో వాడతారు కానీ స్వభావము విషయములో వాడరు. మత్తయి 11:11లో యోహాను మనుష్యులందరిలో గొప్పవాడు అని చెప్పే సందర్భంలో కూడా ఇదే గ్రీకు పదమును వాడటం గమనించండి. అంటే, ఇక్కడ మిగితా మనుష్యులు యోహానుకంటే తక్కువ మనుష్యత్వం కలవారు అని అర్థం కాదు కాని, సాధారణ మనుష్యులకంటే యోహాను గొప్ప “స్థాయి” లేక “పదవి”లో ఉన్నట్టు తెలియజేయడం యేసు యొక్క ఉద్దేశ్యం. అలాగే నాకంటే తండ్రి గొప్పవాడు అన్న దానికి అర్థం ఏమంటే - యేసుకంటే తండ్రి మెరుగైన దేవుడు అని కాదు కానీ ఆయన “స్థాయి” పెద్దది అని అర్థం చేసుకోవాలి. ఏదో సాధించాను అని యూసుఫ్ చూపించే వాక్యభాగాన్ని దాని సందర్భంలో మనం చదివి చూద్దాం. ముఖ్యంగా యోహాను 14:20-21ని గమనిస్తే ఆయన శిష్యులందరిలో నేను ఉంటాను అని చెప్పి దైవగుణమైన - “సర్వమునందు వ్యాపించగల శక్తి” తనకుంది అని చెప్పడం యూసుఫ్‍కి అర్థం అవ్వలేదేమో? అలాగే 23వ వచనములో "మేము" (తండ్రి మరియు యేసు) తమను ప్రేమించిన వారియందు నివాసం చేతుము అని చెప్పడం అయన తనను తండ్రికి సమానముగా చేసికొనడము కాదా? 13,14 వచనాలలో “తన” నామమున మనము ఏది అడిగినను "తానే" చేస్తాను అని యేసు చెప్పడం మరువరాదు. ఇలా ఎన్నో వచనములలో యేసు తండ్రితో ఏకమై ఉన్నట్టు, ఆయనతో సమాత్వమును చాటుకున్నట్టు మనం చదువగలం (యోహాను 10:29).

ఇలా  ముఖ్యమైన విషయాలతో కలిపి కొన్ని అనవసరమైన ప్రశ్నలు కూడా యూసుఫ్ తన శీర్షికలో అడిగాడు. అలా అనవసరమైన ప్రశ్నలను మినహాయించి అతడు ప్రస్తావించిన ముఖ్యమైన ప్రశ్న 13ను చూద్దాం. "యేసు తన లాంటి ఇంకొ ప్రవక్త వస్తాడు అని ప్రవచనం చెప్పారా లేదా?" దీనికి జవాబుగా యేసు చెప్పిన ఆ ప్రవక్త ఇంకెవరో కాదు ముహమ్మదే అని యూసుఫ్ ఎస్తేస్ చేసే వాదన. ఈ వాదనకు సరిపోయేదిగా యోహాను 16:7-8 వచనాలు ఆయన తన శీర్షికలో జతపరచడం జరిగింది. అలాగే ఖురాన్‍లోని సూరహ్ 61:6ని జోడించడం కూడా జరిగింది.

ఈ వాదనను కొంచెం లోతుగా పరిశీలించి చూద్దాం -

యోహాను 16లో ఇలా వ్రాయబడి ఉంది "అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెడలిపోవుట వలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు; నేను వెళ్ళిన యెడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును."

ఖురాన్ 61:7లో "మరియ కుమారుడు యేసు తమ జాతితో ఇట్లనినది జ్ఞాపకము చేసికోనుడు ‘ఓ ఇస్రాయీల్ సంతతి ప్రజలారా! నేను అల్లాహ్ వైపునుండి మీ యొద్దకు ప్రవక్తగా వచ్చితిని. నా రాకకు పూర్వము అవతరింపబడిన (సందేశమైన) 'తౌరాత్' ను దాని భవిష్యత్ వాణులను నేను పూర్తి చేయుదును. నా తరువాత వచ్చు ఒక ప్రవక్త వార్త కూడా అందింతును. అతని పేరు ‘అహ్మద్’. ఆ ప్రవక్త స్పష్ట సాక్ష్యాధారాలతో వచ్చినప్పుడు వారు ‘ఇది స్పష్టమైన మోసము’ అనిరి".

ఈ రెండు వచనములను ఆధారం చేసుకొని యూసుఫ్ ఎస్తేస్ తన వాదనను నిరూపించే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రకారం యోహాను సువార్తలో యేసు చెప్పిన ప్రవక్త ముహమ్మదే; మరియు దానికి సాక్ష్యంగా ముహమ్మద్ తానే స్వయంగా చెప్పుకున్న ఖురాన్‍ను యూసుఫ్ మనకు చూపిస్తున్నాడు. దీనిని విశ్లేషిస్తూ కొంచెం ధ్యానిద్దాం. మొదటగా - యేసు మాటలను ఆ వాక్యము యొక్క సందర్భములోనూ మరియు యోహాను సువార్త మొత్తం ఏ సందర్భంలో వ్రాయబడిందో దానినీ చదివి చూద్దాం. దీనికి ముందు యూసుఫ్ వేసిన ప్రశ్న ఇంకోసారి చూద్దాం.

* యేసు తన వంటి లేక తనను పోలిన ప్రవక్త ఇంకొకడు వస్తాడు అని చెప్పినట్టు యూసుఫ్ అంటున్నాడు. కానీ యోహాను సువార్తలో యేసు తన వంటి ప్రవక్త వస్తాడు అని చెప్పలేదు. ఆదరణకర్త వచ్చును అని ఉంది. ఆ ఆదరణకర్త యేసు వెళ్ళిన తరువాత ఆయనచే పంపబడును అని వ్రాయబడి ఉంది. ఆ ఆదరణకర్త తనను పోలిన ప్రవక్త అని యేసు చెప్పలేదు.

* ఇకపోతే ఇదే యోహాను 16లో ఇంకొంచెం ముందుకు చదివితే 13వ వచనంలో ఈ ఆదరణకర్తను సత్యస్వరూపి అయిన ఆత్మగా వివరించడం జరిగింది. ముహమ్మద్ ఒక “ఆత్మ” అని బహుశా యూసుఫ్ ఎస్తేస్ ఒప్పుకోడేమో!

* అలాగే, ఆదరణకర్త అయిన ఆత్మ తన వాటిలోనివి తీసికొని మాత్రమే ప్రజలకు తెలియజేయును అని యేసు చెప్పారు. మరి ముహమ్మద్ అలా చేసెనో లేదో యూసుఫ్ గారికే తెలియాలి!

* అదే విధంగా, పంపబడిన ఆదరణకర్త యేసును మహిమపరచును అని వ్రాయబడి ఉంది. కానీ ముహమ్మద్ యేసును మహిమపరచనో లేదో ఖురాన్ చదివిన వారికి స్పష్టంగా అర్థం అవుతుంది! నిజానికి యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమ గురించి బైబిల్ తెలియజేస్తున్న ఎన్నో వాస్తవాలను ముహమ్మద్ అవాస్తవాలుగా మార్చి ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు రాకుండా చేసెనని బైబిల్ మరియు ఖురాన్ చదివిన వారెవరైనా గ్రహించగలరు.

ఇలా చూసుకుంటూ పోతే యేసు చెప్పిన ఆదరణకర్తకు పోలిన ఏ ఒక్క గుణమును ముహమ్మద్ తన జీవితములో కనబరచకపోగా క్రీస్తు విరోధిని (ఇతడు సాతాను సంబంధని బైబిల్ వివరిస్తున్నది) పోలిన గుణములను చక్కగా తనలో ఇముడ్చుకున్నట్టు మనం చూడగలం. యేసు మరణ పునరుత్తానముల అనంతరం బయలు వెళ్ళిన ప్రవక్తలు యేసు నామములో బయలుదేరారు. ముహమ్మద్ యేసు నామములో రాలేదు. ఉదాహరణకు మత్తయి 23:34 ప్రకారము యేసు "నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను" అని చెప్పడం జరిగింది. అనగా యేసు తన ప్రవక్తలను తన నామములో పంపుచున్నారు అని అర్థం. ఈ వాక్య భాగాన్ని యోహాను సువార్త యొక్క మొత్తం సందర్భంలో చదివి చూస్తే, యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా మనం గుర్తించగలుగుతాము. మొదటి అధ్యాయంలో - ఆదియందు దేవునితో, దేవుని యొద్ద మరియు దేవుడైయున్న వాక్యమే శరీరధారియై, దేవుని అద్వితీయ కుమారుడైన యేసుగా మనముందు జ్యోతిర్మయుడై, మన పాపముల కొరకు బలియైన దేవుని గొర్రెపిల్లగా ఇలలోకి విచ్చేసిన సంగతి; అలాగే మనము దేవుని పిల్లలముగా అధికారము పొందుటకు ఆయన తన ప్రాణము సైతము స్వచ్ఛందంగా అర్పించటం; పెట్టిన ప్రాణాన్ని మూడవ రోజున తిరిగి తీసుకొని మరణమును జయించి మృత్యుంజయుడై, తనయందు విశ్వసించిన వారికి అమరమైన జీవితాన్ని ఉచితంగా ఇస్తానని ప్రమాణం చేసినట్టుగా ఈ పుస్తకంలో పూసగుచ్చినట్టు సవిస్తరంగా వ్రాయబడి ఉంది. మరి యూసుఫ్ ఎస్తేస్ ఎంచుకొనిన 16వ అధ్యాయమును యోహాను సువార్త యొక్క నేపథ్యంలో చదివి చూస్తే - యేసు ప్రవక్తలను సైతం తన నామమున పంపిచగల మహాదేవుడై ఉండాలి. కానీ ఎప్పటిలాగే ముస్లిం పండితులు వారికి అవసరమయ్యే వచనములు మాత్రమే తమదైన శైలిలో వక్రీకరించి తమకు కావలసిన అర్థాన్ని మాత్రమే తీసుకుంటారు అని లోకమునకు విదితమే కనుక యూసుఫ్ ఎస్తేస్ చేసిన ఈ తుచ్ఛ ప్రయత్నం క్రైస్తవ లోకాన్ని కలవరపెట్టేంత పెద్దదేమీ కాదు.

అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది: యేసు దేవుడా కాదా అని పరీక్షించిన విధానములోనే ముహమ్మద్‍ కూడా ప్రవక్తా కాదా అని పరీక్షించి చూద్దాం.

  • ముహమ్మద్ సాతాను మాటలను పలికి అవి అల్లాహ్ మాటలే అని చెప్పలేదా? ఖురాన్ 53:19,20
  • ముహమ్మద్ పలికిన కొన్ని ప్రవచనములు / భావిష్యవాణులు సయితం తప్పు కాలేదా? ఖురాన్ 30:2-4, 48:27
  • ముహమ్మద్, తాను దయ్యము పట్టినవాడననుకొని ఉండటం అబద్ధమా? సహీహ్ అల్ బుఖారి 9:111
  • ముహమ్మద్ ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం చేయటం అబద్ధమా ? సహీహ్ అల్ బుఖారి 9:111
  • ముహమ్మద్ తనకు అల్లాహ్ నియమించిన భార్యల సంఖ్య కంటే ఎక్కువ మందిని పెండ్లి చేసుకోలేదా? ఖురాన్ 4:3 - సహీహ్ బుఖారి వాల్యూం 7 బుక్ 62 సంఖ్య 142

ముహమ్మద్, తాను లూటీ చేసిన సొమ్ముతో తన సామ్రాజ్యాన్నికట్టలేదా? సహీహ్ బుఖారి వాల్యూం 7 బుక్ 67 సంఖ్య 402పైన చెప్పినవన్నీ జరిగి ఉంటే ఆ వ్యక్తి ప్రవక్త కాదు అని చెప్పటానికి ఏదో పెద్ద చదువులూ లేక ధార్మికమైన మతాధ్యయనం చేసి ఉండవలసిన అవసరం లేదు. సామాన్య తర్కం తెలిసిన యే సామాన్య మానవుడైనా ఇలాంటి పనులు చేసినవాడిని మహా పురుషుడైన ప్రవక్తగా అంగీకరించడు. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడి తన అనుచరులను సైతం ఘాతుకాలకు పాల్పడమని నేర్పించిన ముహమ్మద్, మరియు అతను ప్రతిపాదించిన ఇస్లాం మతం గురించి సరిగ్గా తెలిసిన వారెవ్వరు కూడా మహాఘనుడు, మహోన్నతుడు, జ్యోతిర్మయుడు, పాపుల కొరకు ప్రాణాలర్పించిన మహాదేవుడైన యేసును విడిచి ఇస్లాం మతమునకు పోరు.    


ప్రభుతేజ (తెలుగు రచయిత)
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు